Showing posts with label Andhra Pradesh. Show all posts
Showing posts with label Andhra Pradesh. Show all posts

Wednesday, May 4, 2016

Yaganti

యాగంటి

దేశము:          భారతదేశం
రాష్ట్రం:            ఆంధ్ర ప్రదేశ్
జిల్లా:             చిత్తూరు
ప్రదేశము:       శ్రీకాళహస్తి
నిర్మాణము:  15 వ శతబ్ధం




కర్నూలు జిల్లాలో బ్రహ్మం గారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌనద్ర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి.ఇక్కడి నంది విగ్రహం పెరుగుతూ ఉందని ప్రాంతీయులు నమ్ముతారు.యాగంటి దేవాలయము కర్నూల్ జిల్లాల్లో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయము. ఇక్కడ వున్న నందీశ్వరునికి దేశవ్యాప్తంగా ప్రచారం వున్నది.


యాగంటి నంది విగ్రహం చరిత్ర:




                                                యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం వున్నది. తొలుత ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాలని కట్టారని కాని తయారయిన విగ్రహంలో చిన్న లోపం వున్నందున వెంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్టించలేదని, స్వయంభువుగా ఆ చుట్టు పక్కల వెలసిన ఉమా మహేశ్వర స్వామి వారిని తీసుకుని వచ్చి ఆలయంలో ప్రతిష్టించారని ఒక కథ ప్రచారంలో వున్నది. లోప భూయిష్టమైన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి ప్రక్కనే కొండపైన సహజ సిద్దంగా వున్న గుహలో ఇప్పటికి దర్శించుకోవచ్చు. ఇక్కడున్న పుష్కరిణి లోనికి నీరు నంది నోటి నుండి వస్తూ వుంటుంది.


అగస్త్య పుష్కరిణి:



                             ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది. ఈ కోనేరులో అగస్త్యుడు స్నానమాచరించిన కారణంగా దీనిని అగస్త్య పుష్కరిణి అని అంటారు. ఏ కాలంలో నైనా పుష్కరణి లోని నీరు ఒకె మట్టంలో వుండడం విశేషం. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమౌతాయని నమ్మకం. పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం వున్నది. ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి వున్నది. దీన్ని దాటగానె రంగ మంటపం, ముఖ మంటపం, అంతరాళం, వున్నాయి. గర్బాలయంలో లింగ రూపం పై ఉమా మహేశ్వరుల రూపాలు కూడా వున్నాయి. శ్రీ పోతులూరి వీర బ్రంహం గారు రచించిన కాలగ్నానం లో యాగంటి బసవన్న రోజు రోజుకి పెరుగు తున్నాడని అన్నాడు.

సహజసిద్ధమైన గుహలు:




                                        యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండగుహలు ఆశ్చర్య చకితులను చేస్తాయి. వెంకటేశ్వరస్వామి గుహలో అగస్త్య మహర్షి శ్రీ వేంకటేశ్వరుని విగ్రహం ప్రతిష్టించాడు. ఇక్కడున్న వేంకటేశ్వరుడు భక్తుల పూజలనందు కొంటున్నాడు. ఆ ప్రక్కనె ఇంకో గుహ లో బ్రంహం గారు కొంత కాలం నివసించారని, శిష్యులకు ఙానోపదేశం చేసాడని భక్తులు నమ్ముతారు. దీనిని శంకరగుహ , రోకళ్ళగుహ అనికూడా అంటారు. యాగంటిలో వసతి సౌకర్యాలు లేవు. దగ్గర వున్న బనగాన పల్లి లో వసతులున్నాయి. ఈ క్షేత్రం కర్నూలు నుండి సుమారు వంద కిలో మీటర్ల దూరంలో వున్నది. కర్నూలు, బనగాన పల్లి, నంద్యాల నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం వున్నది.

యాగంటి బసవన్న:



                                    ఇక ఇక్కడి ముఖ మంటపంలో స్వయంభువుగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది. ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ వుండటం . పురావస్తు శాఖ కూడా ఈ విషయాన్ని నిర్ధారణ చేయడంతో మరింత మహిమాన్వితమైనదిగా వెలుగొందుతోంది. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేసాడని బ్రహ్మంగారి కాలఙానం లో ప్రస్థావించబడి ఉంది. యుగాంతంతో ముడిపడిఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది.

కాకులకు శాపం:


                                 ఇక యాగంటిలో కాకి కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో వుంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి అక్కడ వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించాడు. ఆయన ఆ విగ్రహాన్ని మలుస్తూ వుండగా చేతి బొటనవేలుకి గాయమైందట. తన సంకల్పములో లోపమేమో అనే సందేహం తలెత్తడంతో వెంకటేశ్వరస్వామి గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో, అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట. అందువల్లనే ఇక్కడ కాకులు కన్పించవని చెబుతుంటారు.

ఎలావెళ్ళాలి ?
                            ఈ క్షేత్రం కర్నూలు నుండి సుమారు వంద కిలో మీటర్ల దూరంలో వున్నది. కర్నూలు, బనగాన పల్లి, నంద్యాల నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం వున్నది.

Friday, December 11, 2015

బనగానపల్లె

బనగానపల్లె
రాష్ట్రం         :ఆంధ్ర ప్రదేశ్

జిల్లా         :కర్నూలు

                           భారత దేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బనగానపల్లె ఒక చిన్న పట్టణం మరియు మండలము. కర్నూలు జిల్లాలో నున్న బనగానపల్లె 1790 నుండి 1948 వరకు అదే పేరు కలిగిన సంస్థానం గా ఉండేది.
చరిత్ర:

                      1601 లో బీజాపూరు సుల్తాను ఇస్మాయిల్‌ ఆదిల్‌ షా బనగానపల్లె కోటను రాజా నంద చక్రవర్తిని ఓడించి వశపరచుకున్నాడు. ఆక్రమిత ప్రాంతాన్ని, కోటను ఈ విజయం సాధించిన సేనాధిపతి, సిద్ధు సంబల్‌ ఆధీనంలో 1665 వరకు ఉన్నాయి. మహమ్మద్‌ బేగ్‌ ఖాన్‌-ఇ రోస్బహాని బనగానపల్లె జాగీరుపై శాశ్వత హక్కు పొందాడు. కాని అతడు మగ వారసులు లేకుండా చనిపోవడంతో జాగీరు అతని మనవడూ దత్తపుత్రుడూ అయిన ఫైజ్‌ ఆలీ ఖాన్‌ బహదూరు కు ధారాదత్తమైంది. మొగలు చక్రవర్తిఔరంగజేబు 1686లో బీజాపూరును ఆక్రమించుకొన్నపుడు, దక్కనులో అతని ప్రతినిధిగా పనిచేసే ఫైజ్‌ ఆలీ మేనమామ, ముబారిజ్‌ ఖాన్‌ దయవల్ల ఫైజ్‌ ఆలీ ఖాన్‌ స్థానం పదిలంగానే ఉంది.

                    అప్పటినుండి బనగానపల్లెను మొగలు చక్రవర్తుల సామంతులు గా కొన్నాళ్ళు, ఆ తరువాత 1724 లో మొగలుల నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకొన్న హైదరాబాదు నిజాము సామంతులుగా కొన్నాళ్ళు ఫైజ్‌ వారసులే పాలించారు. అతడు కూడా మగ వారసులు లేకుండా మరణించడంతో, అతని మనుమడు హుసేన్‌ ఆలీ ఖాన్‌ బనగానపల్లెకు ప్రభువయ్యాడు. అతని పాలన చివరి రోజుల్లో మైసూరు రాజు హైదరాలీ సామ్రాజ్య‌ విస్తరణ చేయడాన్ని గమనించి అతనికి సామంతుడిగా మారిపోయాడు. 1783లో హుసేను మరణించాక, అతని కుమారుడు, చిన్నవాడైన గులాం మొహమ్మదాలి -మామ రాజ ప్రతినిధిగా- రాజయ్యాడు. ఒక ఏడాది లోనే హైదరాలి వారసుడైన టిప్పు సుల్తాను వాళ్ళను బనగానపల్లె నుండి తరిమివేయగా, వాళ్ళు హైదరాబాదు లో తలదాచుకున్నారు. మళ్ళీ 1789 లో బనగానపల్లె కు తిరిగి వచ్చారు. తరువాత కొన్నాళ్ళకు, దగ్గరలోని చెంచెలిమల జాగీరును వియ్యం ద్వారా కలుపుకున్నారు.

                     1800 తొలినాళ్ళలో బనగానపల్లె బ్రిటిషు ఇండియా లో ఒక సంస్థానం గా మారిపోయింది. ఆర్ధిక లావాదేవీలలో జరిగిన లొసుగుల కారణంగా 1832 నుండి 1848 వరకు ఒకసారి, 1905 లో కొన్ని నెలలపాటు మరోసారి బనగానపల్లె పరిపాలనను మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నరు తన అధీనంలోకి తీసుకున్నాడు. 1901 లో బనగానపల్లె సంస్థానం 660 చ కి మీ ల వైశాల్యంతో 32,264 జనాభాతో ఉండేది. తెలుగు ప్రాంతాల్లో హైదరాబాద్ మినహా బనగానపల్లె మాత్రమే సంస్థానం స్థాయి పొందింది, మిగిలినవన్నీ జమీందారీల హోదాలోనే ఉండేవి.

                     1948 లో కొత్తగా ఏర్పడిన భారత దేశంలో బనగానపల్లె సంస్థానం కలిసిపోయింది; మద్రాసు రాష్ట్రం లోని కర్నూలు జిల్లాలో భాగమయింది. 1953 లో కర్నూలుతో సహా మద్రాసు రాష్ట్రపు ఉత్తర జిల్లాలు కలిసి ఆంధ్ర రాష్ట్రం గా ఏర్పడ్డాయి.
ఆలయాలు:
  1.  బనగానపల్లె - నంద్యాల మార్గంలో బనగానపల్లెకు 8 కి.మీ. దూరంలో, నందవరంలో చౌడేశ్వరీమాత ఆలయం ప్రసిద్ధమైంది. చుట్టుప్రక్కల గ్రామాలనుండి మాత్రమే కాక మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలనుండి కూడా భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొంటుంటారు.
  2. బనగానపల్లె కి 10 కి.మి దూరంలో యాగంటి అను పుణ్యక్షేత్రం ఉన్నది.
  3. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నేలమఠం,కాలగ్నానాన్ని పాతిపెట్టిన చింతమాను మఠం, రవ్వల కొండ ఇక్కడ ప్రసిద్ధి చెందిన ఆలయాలు.




మామిడి:
ప్రధాన వ్యాసం: బంగినపల్లి మామిడి:

                         బనగానెపల్లె "బేనిషా" మామిడి పళ్ళు రాష్ట్రం మొత్తం పేరొందింది. మామిడి పళ్ళను ఇష్టపడే నవాబు, ఒక్కొక్క రకం మామిడి చెట్టుకి ఒక్కొక్క రకం గుర్తు (నిషాన్) చెక్కించేవాడు. అయితే ఒక రకం మామిడి పండు ఎంతో తీయగా, మిగతా అన్ని రకాల కంటే రుచిగా ఉండటంతో, ఆ చెట్టుకి ఏ గుర్తు చెక్కించక, దానికి 'గుర్తు లేనిది' (బే నిషాన్) అని నామకరణం చేయించాడు. అదే వాడుకలో బేనిషా అయ్యింది. ఒక NTR చిత్రంలో "బంగినపల్లి మామిడి పండు రంగుకొచ్చింది" అనే పాట కూడా ఉంది.


Saturday, December 5, 2015

కదళీవనము

కదళీవనము
                     
                          శ్రీశైలం భూకైలాసం నాకు కైలాసం కన్నా శ్రీశైలమే మిన్న అని మహాదేవుడు కొనియాడిన క్షేత్రం శ్రీశైలం. ఆ శ్రీశైల మహాక్షేత్రంలో నెలవై ఉన్న అద్భుత రమణీయ ప్రశాంత ఆధ్యాత్మిక దర్శనీయ స్థలాలలో కదళీవనం ప్రశస్తమైనది.


చరిత్ర:
                 శ్రీ దత్తాత్రేయ స్వామి అవతార పరంపరలో 3వ అవతార పురుషుడైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహారాష్ట్రలోని కరంజా నగరంలొ జన్మించి నర్సోబవాడాలోను, కర్ణాటకలోని గాణాగాపురంలోనూ తపమాచరించి చివరకు కదళీవనంలో అంతర్ధానమయ్యారు. వీరశైవ సంప్రదాయానికి చెందిన అక్క మహాదేవి కూడా ఇక్కడే అవతార సమాప్తి గావించారని ప్రతీతి.




ఇటీవలి చరిత్ర:
                                 మెదక్ జిల్లా తూప్రాన్ కు చెందిన శ్రీలలితా సేవా సమితి వ్యవస్థాపకులైన బ్రహ్మ శ్రీ సోమయాజుల రవీంద్రశర్మ శ్రీ వాసుదేవనంద సరస్వతి స్వామి వ్రాసిన శ్రీ గురుచరిత్ర ఆధారంగా శ్రీశైలంలోని ఈ కదళీవనం గురించి దాదాపు 20 సంవత్సరాలు అన్వేషించి అనంతరం 2002 ఫిబ్రవరి లో తొలిసారి కదళీవనమును సందర్శించి అక్కడ శ్రీనృసింహ సరస్వతి స్వామి విగ్రహాన్ని కదళీవనంలో ప్రతిష్ఠించాలని సంకల్పించి 25-08-2002 నాడు ప్రతిష్ఠ గావించడం జరిగింది.

                                ఇంతటి పుణ్యక్షేత్రం గురించి శ్రీశైలం దేవస్థానానికి తెలియాలనే ఉద్దేశ్యంతో దేవస్థానం వారికి లేఖ ద్వారా తెలియపర్చడం జరిగింది.తరువాత దేవస్థానం వారు పరిశోధించి శ్రీలలిత సేవా సమితి వారు తెలియపరిచింది నిజమే అని వారు నిర్ధారించి శ్రీశైలప్రభ మాసపత్రిక లోనూ మరియు శ్రీశైలం దర్శనీయస్థలాలు పుస్తకం లో నూ ప్రచురించడం జరిగింది.

                                  శ్రీలలిత సేవా సమితి వారిని దేవస్థానం వారు ఎంతో అభినందించడం జరిగింది.శ్రీలలిత సేవా సమితి వారు నృసింహ సరస్వతి స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడమే కాక కదళీ వనానికి వెళ్ళేందుకు దారి తెలిపే బోర్డ్ లను కుడా ఏర్పాటు చేసారు.

శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం:
                                 శంకరభట్టునకు కురువపురమున వాసవాంబిక దర్శనం కలిగి "సమస్త కల్యాణగుణములకు నిలయమైన ఓ వాసవాంబికా! "నీ సంకల్పమే నెరవేరు గాక! నేను ఇంకనూ 14 సంవత్సరములు అనగా యీ శరీరమునకు 30 సంవత్సరములు వచ్చు పర్యంతము యీ శ్రీపాద శ్రీవల్లభ రూపముననే యుండి ఆ తదుపరి గుప్తమయ్యెదను. తిరిగి సన్యాస ధర్మము నుద్ధరించు నిమిత్తము నృసింహ సరస్వతీ నామము నొంది, ఆ అవతారములో 80 సంవత్సరముల వయస్సు వచ్చువరకును ఉండెదను. తదుపరి కదళీవనము నందు 300 సంవత్సరములు తపోనిష్టలో నుండి ప్రజ్ఞాపురమున స్వామిసమర్థ నామధేయముతో అవతారమును చాలించెదను. అవధూతల రూపములతోను, సిద్దపురుషుల రూపములతోను అపరిమితమైన నా దివ్యకళలతో లీలలను, మహిమలను చేయుచూ లోకులను ధర్మకర్మానురక్తులుగా చేసెదను." అని అనిరి.

అద్భుత జలపాతం:



                              అక్కమహాదేవి గుహ నుంచి స్వామివారు తపస్సు చేసిన మరో గుహకి వెళ్లాలంటే... మరో 6 కిలోమీటర్లు ముందుకెళ్లాలి. వెళ్తున్నకొద్దీ అడవి చిక్కబడుతుంది, చెట్ల సందుల్లోని చిన్న దారిలో వెళ్లాల్సి ఉంటుంది. చుట్టూ చెట్లు, పుట్టలు, పొదలు, అక్కడక్కడా వాగులు, నాచుపట్టిన రాళ్లను జాగ్రత్తగా దాటుకుంటూ 3 గంటలు ప్రయాణించి ముందుకెళ్తే గుహకి చేరుకుంటాం.గుహ వద్దకు అడుగుపెట్టగానే సంతోషంతో గట్టిగా కేకలేయకుండా ఉండలేం. ఎందుకంటే, అక్కడ ఓ అందమైన జలపాతం ఉంటుంది. చాలా ఎత్తునుంచి నీళ్లు జారిపడుతూ అద్భుతంగా ఉంటుంది ఆ జలపాతం. ఈ జలపాతం పక్కనే ఉన్న గుహలోనే స్వామివారు తపస్సు చేశారట. ఇప్పుడు అక్కడ ఒక శివలింగం ఉంది. ఇక్కడికి వచ్చే సందర్శకులు జలపాతం నీటితో శివలింగానికి అభిషేకం చేసి పూజిస్తుంటారు.

మార్గం:
                    శ్రీశైలంలోని పాతాళగంగ నుండి 16కిమీలు నీటిలో ప్రయాణించి నీలిగంగ రేవు ఒడ్డు నుంచి సుమారు 8 కి.మి.లు అడవిలో నడచి కదళీవనాన్ని చేరవచ్చు.

Thursday, December 3, 2015

హటకేశ్వరం

హటకేశ్వరం

రాష్ట్రం         :ఆంధ్ర ప్రదేశ్
జిల్లా         :కర్నూలు
మండలం   :శ్రీశైలం



                                      హటకేశ్వరం, కర్నూలు జిల్లా, శ్రీశైలం మండలానికి చెందిన గ్రామము. శ్రీశైలమల్లిఖార్జున దేవస్థానమునకు మూడు కిలోమీటర్ల దూరములో కల మరొక పుణ్యక్షేత్రం హటకేశ్వరం.ఇక్కడ హటకేశ్వరాలయము  కలదు. ఈ పరిశరాలలోనే శ్రీ ఆది శంకరాచార్యులవారు నివశించారు.
చరిత్ర:


                పరమశివుడు అటిక (ఉట్టి, కుండ పెంకు)లో వెలియడంతో ఈ ఆలయంలోని ఈశ్వరుని అటికేశ్వరుడు అనేవారు రానురాను అదేమెల్లగా హటికేశ్వరస్వామిగా మారిపోయింది. హటకేశ్వర నామంతో ఆప్రాంతానికి రాకపోకలు సాగించే భక్తుల మాటగా హటకేశ్వరంగా పిలువ బడుతోంది. ఇక్కడ చెంచులు అదివాశీలు నివసిస్తున్నారు. ఈ దేవాలయ పరిసరాలలో పలు ఆశ్రమములు, మఠములు కలవు. ఇక్కడికి వచ్చెందుకు శ్రీశైలం దేవస్థానము నుండి ప్రతి అర గంటకు బస్సులు కలవు.


ఒక చిన్న కథ:
                             హటకేశ్వరం క్షేత్రం గురించి చెప్పుకునేటప్పుడు ... మహాభక్తుడైన కుమ్మరి కేశప్ప గురించి కూడా తప్పని సరిగా చెప్పుకోవలసి వస్తుంది. నిస్వార్ధమైన సేవతో ... అనితర సాధ్యమైన భక్తితో సాక్షాత్తు సదాశివుడి అనుగ్రహాన్ని పొందిన కేశప్ప , శ్రీ శైలం సమీపంలోని ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు. కుమ్మరి కులానికి చెందిన కేశప్ప ... తన వృత్తిని చేసుకుంటూనే, శ్రీశైల దర్శనానికి వచ్చే భక్తులకు భోజన వసతులు ఏర్పాటు చేసేవాడు.

                            శివయ్య దర్శనానికి వెళ్లే వారు అక్కడ భోజనాలు చేసి ఆయన సేవను కొనియాడుతూ ...... దారి పొడవునా ఆయన గురించి చెప్పుకుంటూ వుండేవారు. దాంతో కుమ్మరి కేశప్ప పేరు అందరికీ సుపరిచితమైపోయింది. ఇది సహించలేకపోయిన ఇరుగుపొరుగువారు ... ఓ రాత్రి వేళ అతని కుండలను పగులగొట్టడమే కాకుండా, కుండలను తయారు చేసే 'అటికె'ను కూడా పాడు చేశారు.

                                తెల్లారగానే జరిగింది చూసిన కేశప్ప లబోదిబోమన్నాడు. శివరాత్రి పర్వదినం రావడంతో యాత్రికుల సంఖ్య పెరిగింది. అటికె పాడైపోయినందున ఏం చేయాలో పాలుపోక కేశప్ప దిగాలు పడిపోయాడు. ఎలాగైనా అటికెను బాగు చేయాలనే ఉద్దేశంతో నానా తంటాలు పడసాగాడు. అదే అదనుగా భావించిన ఇరుగు పొరుగు వారు కావాలని చెప్పేసి భోజనం కోసం అతని ఇంటికి యాత్రికులను పంపించారు.

                                అమ్మడానికి కుండలు లేవు ... తయారు చేయడానికి అటికె లేదు. యాత్రికులను సాదరంగా ఆహ్వానించిన కేశప్ప, ఎలా భోజనాలు ఏర్పాటు చేయాలో తెలియక పెరట్లో కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు అటికె పై శివుడు ప్రత్యక్షమై, లోపలోకి వెళ్లి యాత్రికులకు భోజనాలు వడ్డించమని చెప్పాడు. శివుడికి నమస్కరించి లోపలి వెళ్ళిన కేశప్ప కి అక్కడ కుండల నిండుగా వివిధ రకాల పదార్థాలతో కూడిన భోజనం కనిపించింది. దానిని యాత్రికులకు కడుపు నిండుగా ... సంతృప్తిగా వడ్డించాడు.

                               శివుడు అటికె లో ప్రత్యక్షమైన ఈ ప్రదేశమే 'అటికేశ్వరంగా' పిలవబడి కాలక్రమంలో 'హటకేశ్వరం'గా ప్రసిద్ధి చెందింది. సాక్షాత్తు సదాశివుడే ఆవిర్భవించేలా చేయగలిగిన మహా భక్తుడిగా కేశప్ప చరిత్రలో నిలిచిపోయాడు.

విశేషాలు:
  1. ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో శిఖరేశ్వరం కలదు.
  2. హటకేశ్వరం దేవాలయానికి వెళ్ళే దారికి ఎదురు దారిలో పాలదార-పంచదార లు కలవు. 
  3. ఇక్కడే ఆదిశంకరాచార్యుడు చాలాకాలం తపస్సు చేసినది. ఒక బండపై అయన కాలిముద్రలు కలవు.
  4. ఇక్కడ వివిధ రకముల మూలికలు, తేనె మరియు సరస్వతి ఆకు లభిస్తాయి.


Saturday, November 28, 2015

మంగళగిరి

మంగళగిరి

రాష్ట్రం:        ఆంధ్ర ప్రదేశ్
జిల్లా:         గుంటూరు
ప్రదేశము:  మంగళగిరి



                                  ఈ చారిత్రక పట్టణములో ప్రసిద్ధి చెందిన, పురాతనమైన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఉన్నది. మంగళగిరి అనగానే పానకాల స్వామి స్ఫురణకు వస్తాడు. మంగళగిరి పట్టణం ఒక పురపాలక సంఘం మరియు రాష్ట్ర శాసనసభ కు ఒక నియోజకవర్గ కేంద్రం.

పాలకులు:


                                 మంగళగిరి క్రీ.పూ.225 నాటికే ఉనికిలో ఉన్నట్లు తెలుస్తోంది. ధాన్యకటకం రాజధానిగా క్రీ.పూ.225 నుండి క్రీ.శ.225 వరకు పాలించిన ఆంధ్ర శాతవాహనుల రాజ్యంలో మంగళగిరి ఒక భాగం. క్రీ.శ.225 నుండి క్రీ.శ.300 వరకు ఇక్ష్వాకులు పరిపాలించారు. ఆ తరువాత మంగళగిరి పల్లవుల ఏలుబడిలోకి వచ్చింది. పిమ్మట కంతేరు రాజధానిగా పాలించిన ఆనందగోత్రిజుల అధీనంలోకి వచ్చింది. క్రీ.శ.420 నుండి క్రీ.శ.620 వరకు విష్ణు కుండినులు మంగళగిరి ని పరిపాలించారు. రెండవ మాధవ వర్మ విజయవాడ రాజధానిగా చేసుకొని మంగళగిరిని పరిపాలించాడు. క్రీ.శ.630 నుండి చాళుక్యుల ఏలుబడి సాగింది.

                                     1182 నాటి పలనాటి యుద్ధం తరువాత మంగళగిరి కాకతీయుల పాలనలోకి వచ్చింది. 1323లో, ఢిల్లీ సుల్తానులు కాకతీయులను ఓడించాక మంగళగిరిపై సుల్తానుల పెత్తనం మొదలయింది. 1353లో, కొండవీడు రాజధానిగా రెడ్డి రాజులు పాలించారు. 1424లో, కొండవీడు పతనం చెందాక, మంగళగిరి గజపతుల ఏలుబడిలోకి వచ్చింది.

                                       1515లో శ్రీ కృష్ణదేవ రాయలు గజపతులను ఓడించిన తరువాత మంగళగిరి విజయనగర రాయల అధీనమయింది. విజయనగర రాజ్యంలోని 200 పట్టణాలలో మంగళగిరి ఒకటి. 1565లో జరిగిన తళ్ళికోట యుద్ధంతో విజయనగర రాజ్య పతనం పరిపూర్ణమైన తరువాత, మంగళగిరికి గోల్కొండ కుతుబ్‌షాహీలు ప్రభువులయ్యారు. కుతుబ్‌షాహీలు కొండవీడు రాజ్యాన్ని 14 భాగాలుగా విభజించగా వాటిలో మంగళగిరి ఒకటి. మంగళగిరి విభాగంలో 33 గ్రామాలు ఉండేవి. 1750 నుండి 1758 వరకు ఫ్రెంచి పాలనలోను, 1758 నుండి 1788 వరకు నిజాము పాలనలోను ఉన్నది.

                                        1788, సెప్టెంబర్ 18, హైదరాబాదు నవాబు అయిన నిజాము ఆలీ ఖాను గుంటూరును బ్రిటీషు వారికి ఇచ్చివేసాడు. బ్రిటీషు వారు వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు ను ఈ ప్రాంతానికి జమీందారుగా నియమించారు. ఆయన లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి గోపురం నిర్మింపజేసాడు. 1788 నుండి 1794 వరకు ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారి సర్క్యూట్‌ కమిటీ మంగళగిరిని పాలించింది. 1794లో సర్క్యూట్‌ కమిటీని రద్దుచేసి, 14 మండలాలతో గుంటూరు జిల్లాను ఏర్పాటు చేసారు. 1859లో, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాతో ఏకమై, మళ్ళీ 1904, జనవరి 10న విడివడి ప్రత్యేక జిల్లాగా రూపొందింది. అప్పటినుండి మంగళగిరి గుంటూరు జిల్లాలో భాగంగా ఉంటూ వచ్చింది.


లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం:




                                ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వాస్తవంగా రెండు దేవాలయాల కింద లెక్క. కొండ కింద ఉన్న దేవుడి పేరు లక్ష్మీనరసింహ స్వామి. కొండ పైన ఉన్న దేవుడిని పానకాల స్వామి అని అంటారు. కొండ పైని దేవాలయంలో విగ్రహమేమీ ఉండదు; కేవలం తెరుచుకుని ఉన్న నోరు ఆకారంలో ఒక రంధ్రం ఉంటుంది. ఆ తెరచుకొని ఉన్న రంధ్రమే పానకాల స్వామిగా ప్రజల నమ్మకం.మంగళగిరి పానకాలస్వామి కి ఒక ప్రత్యేకత ఉంది. పానకాలస్వామికి పానకం (బెల్లం, పంచదార, చెరకు) అభిషేకం చేస్తే, అభిషేకం చేసిన పానకంలో సగం పానకాన్ని స్వామి త్రాగి, మిగిలిన సగాన్ని మనకు ప్రసాదం గా వదిలిపెడతాడుట. ఎంత పానకం అభిషేకించినా, అందులో సగమే త్రాగి, మిగిలిన సగాన్ని భక్తులకు వదలడం ఇక్కడ విశేషం. అందుకనే స్వామిని పానకాలస్వామి అని పిలుస్తారు.


గాలిగోపురం:


                                  మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి గాలిగోపురం రాష్ట్రంలో అత్యంత ఎత్తయినది.రెండు శతాబ్దాలను పూర్తిచేసుకుంది.మంగళగిరి గాలిగోపురాన్ని తొలగించి దానిస్థానే మళ్లీ అదేరీతిలోనూతనంగా కొత్త గోపురం నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.11 అంతస్తులతో 157 అడుగుల ఎత్తును కలిగి...కేవలం 49 అడుగుల పీఠభాగంతో గాలిలో ఠీవిగా నిలబడినట్టు కనిపిస్తూ సందర్శకులను అబ్బురపరిచే అద్వితీయ నిర్మాణమిది.దీనిని 1807-09 కాలంలో నాటి ధరణికోట జమిందారు శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు నిర్మించారు. ఈ గోపుర పీఠభాగం పూర్తిగా రాతిచే నిర్మితమైంది. ఈ రాతి కట్టడానికి అన్నీ వైపులా పగుళ్లు వచ్చాయి.గోపుర పీఠభాగం త్రీడీ లేజర్ స్కానర్‌ తో పునాదుల అంతర్భాగాన్ని స్కానింగ్ చేయించాలని భక్తులు కోరుతున్నారు.మంగళగిరి గోపురాన్ని ఈ ప్రాంత ప్రజలు వారసత్వ సంపదగా భావిస్తుంటారు.

ధర్మగుణం ఇంకా ఉంది:


                             పానకాలస్వామికి ఇక్కడ డ్రమ్ముల కొద్దీ పానకాన్ని తయారు చేస్తుంటారు. పానకం తయారీ సందర్భంగా కింద ఎంతగా ఒలికిపోయినా ఈగలు చీమలు చేరవట. సృష్టిలో ధర్మం పూర్తిగా నశించి యుగ సమాప్తి దగ్గరపడినపుడు మాత్రమే పానకం ఒలికినపుడు ఈగలు, చీమలు చేరడం ఆరంభమవుతుందని అంటారు. మద్రాసులోని సెయింట్‌ జార్జి ఫోర్ట్‌ గవర్నర్‌ రస్టెయిన్‌షామ్‌ మాస్టర్‌ మచిలీట్నం నుంచి మద్రాసు వెడుతూ 1679 మార్చి 22వ తేదిన మంగళగిరి చేరుకున్నాడు. ఆ రాత్రి ఆయన ఇక్కడే బసచేసి, ఈ మహత్తును గురించి విని, స్వయంగా కొండపైకి వెళ్లి పానకాలరాయుని సన్నిధిని పరిశీలనగా చూశారు. ఇదేదో గమ్మత్తుగా ఉందని, తనకైతే నమ్మశక్యంగా లేదన్నారు. మంగళగిరిలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. హేతువాదులు మంగళగిరి కొండ ఓ అగ్ని పర్వతమని, దీనిలో గంధకం ఉందని, ఎప్పటికైనా పేలిపోయే ప్రమాదముందని, ఆ విపత్తు నుంచి మంగళగిరిని రక్షించేందుకే, గంధకాన్ని ఉపశమింపజేసేందుకే, నిత్యం పానకాన్ని నివేదించాలని, పూర్వీకులు దేవుని పేరిట ఈ ఏర్పాటు చేశారని వాదిస్తుంటారు.

ఎలా వెల్లలి?
                     గుంటూరు - విజయవాడ జాతీయ రహదారి పై గుంటూరుకు 20 కి.మీ దూరంలో ఉన్నది.విజయవడ నుండి అన్ని రకాల ప్రయాన వసతులు బుస్,రైల్వే,మరియు విమనశ్రయం ఉన్నయి. విజయవడ నుండి మంగలగిరి కి 14 కిమి దూరం లో ఉంది.