Monday, October 26, 2015

భీమారామము (Bhimaramam)

భీమారామము
దేశము:     భారత దేశం
రాష్ట్రం:        ఆంధ్ర ప్రదేశ్
జిల్లా:        తూర్పు గోదావరి
ప్రదేశము:  సామర్లకోట

ఆలయం యొక్క వివరాలు:
ప్రధాన దైవం:         శివ(శంకరుడు)
ప్రధాన దేవత:        బాలత్రిపుర సుందరి
ముఖ్య_ఉత్సవాలు:  మహా శివరాత్రి
వాస్తు శిల్ప శైలి :     చాళుక్యులు, కాకతీయుల శైలి
నిర్మాణ తేదీ:          9 వ శతాబ్ది
సృష్టికర్త:                  భీమేశ్వర



                                 పంచారామాలలో ఒకటయిన ఈ కుమారభీమారామము క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటచేలతో సామర్లకోట కు కిలోమీటరు దూరంలో ఉంటుంది. ఇక్కడ లింగం కూడా 14 అడుగుల ఎత్తున రెండుఆంతస్తుల మండపంగా ఉంటుంది. పై అంతస్తులోకి వెళ్ళి పూజలు జరపాలి. మహాశివరాత్రి ఉత్సవం ఇక్కడ ముఖ్యమైన పర్వదినం.
చరిత్ర        




                         సామర్లకోట లోని భీమేశ్వరాలయాన్ని చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడినది. ఈయనే ద్రాక్షరామ దేవాలయాన్నీ నిర్మించినది. అందుకె ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా వుండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడ ఒకటేరకంగా మరియు నిర్మాణ శైలికూడా ఒకే విధంగా వుంటుంది.

                           ఈ మందిరం నిర్మాణం క్రీ.శ 892 లో ప్రారంభమై సుమారు క్రీ.శ. 922 వరకు సాగింది.ఆలయం నిర్మాణం చాలా చక్కని శిల్ప కళ కలిగి ఇప్పటికీ పగుళ్ళు లేకుండా ఉంది. ఇక్కడి శివలింగం సున్నపురాయితో చేయబడి తెల్లని రంగులో ఉంది. 1340-1466 మధ్యకాలంలో రాజ్యం చేసిన కాకతీయులు ఈ మందిరాన్ని కొంత పునర్మిర్మించారు. ఇక్కడ కాకతీయుల నాటి శిల్ప కళను, అంతకు పూర్వపు తూర్పు చాళుక్యులనాటి శిల్ప కళను తేలికగా గుర్తించవచ్చును. ఇక్కడి అమ్మవారు బాలాత్రిపురసుందరి. శివుడు కాలభైరవుని రూపంలో కూడా ఉన్నాడు. 1147 - 1494 మధ్యకాలంలో ఆలయానికి సమర్పించిన విరాళాల గురించిన శాసనాలున్నాయి.

ఆలయం:

                                    ఇక్కడ ఆలయంలోని ఈశ్వరుడు కుమార భీమేశ్వరుడుగా ప్రసిద్ధిచెందగా, అమ్మవారు బాలాత్రిపురసుందరి గా పూజలు అందుకుంటోంది. విశాలమైన ప్రాకారాలతో, నాలుగు ద్వారాలతో ,కోనేటి జలాలతో , చాళుక్యుల శిల్పకళా నైపుణ్యంతో అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించాగానే మనసుకి ఎంతో ఆహ్లాదం , ఆనందం కలుగుతాయి. దేవాలయం లోపలి ప్రాకారంలో వినాయకుడు, కాల భైరవుడు , వీరభద్రుడు,మహాకాళి, శనేశ్వరుడు , నవగ్రహాలు కొలువుదీరు కనిపిస్తాయి. ప్రధాన ద్వారానికి ఎడమవైపున బాలాత్రిపురసుందరి అమ్మవారు కుడి వైపున ఊయల మంటపం కనిపిస్తాయి.గర్భగుడిలో రెండో అంతస్తు వరకూ పెరిగిన 14 అడుగుల భీమేశ్వరుడి శివలింగం నయనానందాన్ని కలిగిస్తుంటుంది. నిర్మాణ సమయంలోనే ఈ శివలింగం అంతకంతకు పెరిగిపోతుండటం గమనించి శిల్పులు శివలింగం పైభాగాన చీల కొట్టారనే కథ స్థానికంగా వినిపిస్తూ వుంటుంది. స్వామివారికి ఎదురుగా ఆరు అడుగుల ఎత్తులో నందీశ్వరుడు కూర్చుని ఉంటాడు.

                                             గుడిలో స్వామి వారికి ఎదురుగా మండపంలో వున్న నంది విగ్రహం ఏక శిలచే చెక్కబడివున్నది.ఆలయంలోని మండపం నూరు రాతిస్తంభాలంకలిగి వున్నది.రెండో అంతస్తువరకు దాదాపు 14 అడుగులున్న శివ లింగం,సున్నపు రాయి చే నిర్మితం.శివలింగఆధారం క్రింది గదిలో వుండగా,లింగ అగ్రభాగం పై కప్పును చీల్చుకొని మొదటి అంతస్తు వరకుండును.భక్తులు పూజలు,అర్చనలు ఇక్కడే చేయుదురు.మొదట మొదటి అంతస్తులో వున్న లింగ దర్శనం తరువాత క్రిందవున్న లింగ పాద భాగాన్ని దర్శించుకొనెదరు.మొదటి అంతస్తుకు చేరుటకు ఇరువైపులనుండి మెట్లు వున్నవి.

                              ఈ దేవాలయ నిర్మాణం పంచారామాలలో ఒక్కటైన ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయంను పోలివుండును.అక్కడిలానే ఈ దేవాలయం చుట్టు రెండు ఎత్తయిన రెండు ప్రాకారాలను కలిగివున్నది.ప్రాకారాపు గోడలు ఇసుక రాయి(sand stone)చే కట్టబడినవి.వెలుపలి ప్రాకారపు గోడకు నాలుగుదిక్కులలో నాలుగు ప్రవేశ మార్గాలున్నాయి.ప్రదాన ప్రవేశ ద్వారాన్ని సూర్య ద్వారం అంటారు.గుడిలోని స్థంబాల మీద అప్సర బొమ్మలు చెక్కబడివున్నవి.చాళుక్య వంశానికి చెందిన విక్రమాదిత్యుని పుత్రుడు చాళుక్య భీమేశ్వర కుమరరామ పేరుమీదుగా ఇక్కడి శివున్ని కుమరరామ అని వ్యవహారంలోకి వచ్చినట్లు తెలుస్తున్నది.

ఉత్సవాలు పూజలు:
                        ఇక చైత్ర , వైశాఖ మాసాల్లో సూర్య కిరణాలు ఉదయం వేళలో స్వామివారి పాదాలను సాయంత్రం సమయంలో అమ్మవారి పాదాలను తాకడం ఇక్కడి విశేషంగా చెప్పుకుంటారు. శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి రోజున భీమేశ్వరస్వామికి బాలాత్రిపురసుందరికి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిస్తారు. అయిదు రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో స్వామివారిని నందివాహనంపై అమ్మవారిని సింహవాహనంపై ఊరేగిస్తారు. ఈ కల్యాణాన్ని తిలకించడానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలంతా వస్తుంటారు. ఇక కార్తీక మాసంలో కూడా ఇక్కడ పూజలు .అభిషేకాలు , ఉత్సవాలు విరివిగా జరుగుతూ వుంటాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ భక్తులు పునీతులవుతుంటారు.
ప్రయాణ వసతులు:
                          ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ వారు పంచారామాలను బస్సులో ఒక్కరోజులో దర్శించే యాత్రా సౌకర్యాన్ని కలిగిస్తున్నారు. షుమారు 700 కి.మీ. సాగే ఈ యాత్ర ప్రతిరోజు రాత్రి 8.00 గంటలకు మొదలై మళ్ళీ మరునాడు రాత్రి 8.00 గంటలకు ముగుస్తుంది.